సముద్రంలో డాల్ఫిన్లతో రజనీకాంత్‌ ఫైట్

హైదరాబాద్ : రజనీకాంత్‌ నడి సముద్రంలో డాల్ఫిన్లతో ఫైట్ చేసారు. 'విక్రమసింహ' చిత్రం కోసం ఆయన చేసిన ఆ పోరాటం ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగిస్తుందని దర్శకురాలు ..ఆయన కుమార్తె అయిన సౌందర్య చెప్పారు. ఆమె దర్శకత్వంలో రూపొందుతున్న యానిమేషన్‌ చిత్రమిది. ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.
సౌందర్య మాట్లాడుతూ ''ఈ చిత్రంలో పలు పోరాట సన్నివేశాలుంటాయి. వాటిలో డాల్ఫిన్లతో చేసే ఫైట్‌ మాత్రం ప్రత్యేకమైనది. అలాగే కొన్ని క్రూర మృగాలతో విక్రమసింహుడు చేసే పోరాటాలుంటాయి. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ అందించిన బాణీలు ప్రధాన బలం. త్వరలో పాటల విడుదల తేదీని ప్రకటిస్తాము''అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రీ రికార్డింగ్‌ కార్యక్రమాలు నడుస్తున్నాయి.

రాజుల కాలం నాటి కథతో, గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో ట్రైలర్‌ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. 'కోచ్చడయాన్‌'ను వెలుగుల పండుగకు జనం ముందుకు తీసుకెళ్లేందుకు నిర్మాత సిద్ధమైనట్లు సమాచారం. నిర్మాణాంతర పనులు ఒకట్రెండు నెలల్లో పూర్తయ్యే సూచనలు కనిపిస్తుండటంతో
దీపావళి కానుకగా విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం.

రజనీకాంత్ ''నా సినీ జీవితంలో ఇదో గొప్ప చిత్రమవుతుంది. మరో మైలురాయిగా నిలుస్తుంది''అన్నారు రజనీకాంత్. ఈ చిత్రం 'కోచ్చడయాన్‌' అనే యోధుడు కథ ని తెలుపుతుంది. ఈ చిత్రంలో రజనీ...ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇది వందశాతం రజనీ ఫార్ములా చిత్రం అని చెప్తున్నారు.